Sunday, June 26, 2022

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా

 ‘దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా’ అంటాడు రాముడు.      ఏ దేశానికి వెళ్లినా కొత్త మిత్రులు, కొత్త బంధువులు దొరుకుతారేమో! కానీ, తోడబుట్టిన వాళ్లు మాత్రం దొరకరు.      అన్నదమ్ముల మధ్య సౌహార్దం, ఆనందం, సున్నితత్వం, సంతోషం ఎంత గొప్పగా ఉంటాయో రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నుల ద్వారా తెలుస్తుంది.    వాలి,- సుగ్రీవుల మధ్య అనుబంధం కొరవడటంతో సుగ్రీవుడొక్కడే మిగిలాడు.      రావణ, విభీషణ, కుంభకర్ణుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో "విభీషణుడు," ఒక్కడే మిగిలాడు.     సోదరులతో కలిసి ఉన్న రాముడిని చూసి విభీషణుడు ‘నా వల్లే మా అన్న మరణించాడు. అన్నదమ్ములుగా కలిసి బతకలేకపోవడం కన్నా సిగ్గుచేటు లోకంలో మరొకటి లేదు’ అని విలపిస్తాడు. తోబుట్టువుతో కూడా కలిసి జీవించలేనివాడు లోకంలో ఇంకెవరితో కలిసి ఉండగలడు?

అరణ్యవాసానికి వెళ్లిన తొలినాళ్లలో ఒకరోజు రాముడు  - లక్ష్మణుడిని పిలిచి ‘భరతుడు మన తల్లులకు ఆపద తలపెడతాడేమో? నువ్వు ఇంటికి వెళ్లడం మంచిది’ అని చెప్తాడు.     అప్పుడు లక్ష్మణుడు ‘ఇదే మాట వదినకు చెప్పవేం అన్నయ్య! ఆమె నిన్ను వదిలి ఉండలేదు కాబట్టి చెప్పడం లేదు కదా! కానీ, నేను కూడా నిన్ను విడిచి ఉండలేను.     అది నా బలహీనత, బలం కూడా! చేప నీళ్లలో ఉన్నంత కాలమే బతికినట్టు, నువ్వు ఎంతకాలం నాకు కనబడతావో అంతవరకే నేను బతికి ఉంటాను’ అంటాడు "లక్ష్మణుడు.'


🙏 ఇక భరతుడి విషయానికి వస్తే, తన తల్లి కోరికలే రాముడి వనవాసానికి కారణమని తెలిసి కుంగిపోతాడు. అడవుల్లో ఉన్న రాముణ్ని వెతుక్కుంటూ వెళ్లి కలుస్తాడు.     అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు కావాల్సిందిగా కోరుతాడు.     కానీ, తండ్రికి ఇచ్చిన మాట తప్పలేనన్న రాముడు, భరతుడికి ధర్మబోధ చేస్తాడు.       అన్న మీద అభిమానంతో, గౌరవం తో పాదుకలను రాముడి పాదాలకు తొడిగించి, ‘నువ్వు అయోధ్యకు వచ్చేంతవరకు ఈ 'పాదుకలే," రాజ్యపాలన చేస్తాయ’ని చెప్పి వాటిని తనవెంట తీసుకెళ్తాడు భరతుడు.


🙏సుగ్రీవుడి మీదికి యుద్ధానికి వెళ్తున్న వాలికి తార అడ్డుపడుతుంది. ‘ఒకసారి నా మాట విను. ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలు మీరు.     ఒకే చెట్టుకు కాసిన కాయల్లాంటి వారు. మనకున్న రెండు చేతులు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయా! పైగా ఒకదానికి నొప్పి కలిగితే, దాని పని కూడా రెండో చేయి చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు చేతులు ఒకే శరీర సంబంధం కలిగి ఉన్నాయి’ అని "అన్నదమ్ముల అనుబంధం ' గొప్పదనాన్ని వివరిస్తుంది తార.   . ఆమె మాటలు పెడచెవిన పెట్టి వాలి తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు.



🙏బాల్యంలో అన్యోన్యంగా పెరిగిన అన్నదమ్ములు పెద్దయ్యాక లౌకిక వ్యవహారాల్లో పడి ఆప్యాయతలు దూరం చేసుకుంటుంటారు. ఆస్తిపాస్తుల ఉచ్చులోపడి అనురాగాలకు దూరమవుతుంటారు. ఏండ్లకేండ్లు ముఖాలు కూడా చూసుకోకుండా ఏదో సాధించామని భ్రమలో బతుకుతుంటారు.   ‌కానీ, ఏడాదికి ఒకసారైనా అన్నదమ్ములంతా కలిసి తల్లిదండ్రులకు "శ్రాద్ధ విధులు".   నిర్వర్తించాలి. శ్రాద్ధంలో తమ్ముల చేతుల్లోంచి అన్న చేతులమీదుగా జారిన తిలోదకాలతో "పితృదేవతలు "తమ దాహం తీర్చుకుంటారట. ఎక్కడివారు అక్కడే తద్దినాలు పెడితే, ఆ పిల్లలను చూసి ఇలాంటి నీచులను కన్నామని పితృదేవతలు చిన్నబుచ్చుకుంటారట. ఒక కడుపున పుట్టినప్పుడు ఒకటిగా ఉండటం సాధ్యం కాదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

అన్న ఎంత ధార్మికుడు, తమ్ముడు ఎంత మంచివాడు కానివ్వండి.. ఒకరింటికి ఒకరు వెళ్లకపోతే వాళ్ల గౌరవం చేజేతులా నాశనం చేసుకున్నట్టే.   ‌వ్యక్తిగతంగా ఇద్దరూ మంచివాళ్లే అయినా, వైరం ఇద్దరి కీర్తినీ మంటగలుపుతుంది.


🙏 చిన్నప్పుడు ప్రేమగా పెరిగి, వయసొచ్చాక మనస్పర్ధలు పెంచుకోవడం అర్థ రహితం.    పెద్దవాళ్లయ్యాక కూడా తోబుట్టువులు అందరితో కలిసి ఆప్యాయతలు పంచుకోవడం కన్నా అదృష్టం మరొకటి లేదు. రక్త సంబంధం గొప్పదనాన్ని గుర్తించి మన కుటుంబవ్యవస్థను కాపాడుకుందాం.   అన్నను గౌరవించడం, తమ్ముడిని ఆదరించడం, సోదరిని కనిపెట్టుకొని ఉండటం తోబుట్టువులు కనీస ధర్మంగా భావించాలి.

" హరిసర్వోత్తమ"

" వాయు జీవోత్తమ'

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

No comments:

Post a Comment